నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు
October 03, 2024
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఈ రోజు సాయంత్రం 5.45 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈరోజు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
ఉత్సవాల నేపథ్యంలో ప్రైవేటు వాహనాలు పీఏసీ 3వరకే అనుమతి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే నహహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టిటిడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందు రోజు నిర్వహించే అంకురార్పణ కార్యక్రమాన్ని గురువారం (నిన్న) రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేనాధిపతి విష్వక్సేనుల ఉత్సవం ఘనంగా జరిగింది. మాడ వీధుల్లో విష్వక్సేనుల ఊరేగింపు నిర్వహించారు.
ఈ రోజు సాయంత్రం 5.45 గంటలకు మీన లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు రాత్రి వాహన సేవలు మొదలై తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి ఊరేగింపు చేయనున్నారు. 12వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు.
ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రైవేటు వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ రోజు (4వతేదీ) నుండి ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం వరకూ ప్రైవేటు వాహనాలను పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతిస్తారు. గరుడ సేవ సందర్భంగా 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి 9వ తేదీ ఉదయం 9 గంటల వరకూ ప్రైవేటు వాహనాలకు ఘాట్ రోడ్లో అనుమతి నిరాకరించింది. అలాగే, 9వ తేదీ ఉదయం 9గంటల నుండి 12వ తేదీ వరకూ ప్రైవేటు వాహనాలను పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు నిలిపివేసినట్లు ప్రకటించారు.